మహిమ గల కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి గురించి మీకు తెలుసా?

రామనామ జపంతో తరిచి చిరంజీవి అయిన  శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. ఎక్కడైనా రామనామ జపం , కీర్తనలు జరుగుతుంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడని చెబుతుంటుంటారు. అంతేకాదు, నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. చాలాచోట్ల హనుమాన్ మందిరాలున్నాయి. ఇక  ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన ఆలయం ఒకటి వుంది. అదే  హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ లోని ఆంజనేయ స్వామి టెంపుల్.  వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయని అంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయం వెనుక చాలా చరిత్ర మహిమ వున్నాయి.


  • క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే  రాజు రెండో ప్రతాపరుద్రుడు. అతడు వేటాడుతూ అలసిపోయి  ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. 
  • కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు చేరుకుంటాడు . 
  • అక్కడ ఎటు చూసినా ఏమి కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు బయలు దేరి వస్తాడు . 
  • మళ్లీ పులి గాండ్రింపు వినిపిస్తుంది దాంతో చుట్టుపక్కల అంతా శోధిస్తాడు అయినా  కూడా ఎలాంటి జంతువు  ప్రతాపరుద్రుడుకు కనిపించదు. 
  • అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు ప్రతాపరుద్రుడు. 
  • ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేయడం మొదలు పెడతాడు . 
  • కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్లు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయస్వామి విగ్రహం అతనికి కనపడుతుంది . 
  •  దీంతో పరమానందభరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి అనంతరం  తిరిగి కోటకు చేరుకుంటాడు . ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు.
  •  స్వామి ఆదేశం ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని  కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు.
  • అయితే 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొగల్‌ పాలకుడు ఔరంగజేబ్‌ స్వాధీనం చేసుకున్నాడు. 
  • అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు దాంతో ఆ స్వామి  దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్‌ స్వయంగా దాడికి దిగాడు. 
  • ఔరంగజేబ్‌  ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో ‘మందిర్‌ తోడ్‌నా హైతో పహలె తుమ్‌ కరో మన్‌ఘట్‌’(ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనస్సును గట్టిగా చేసుకో) అని పలికింది. దీంతో ఔరంగజేబ్‌ తనకు కనపడమని కోరగా తాటిచెట్టు కంటే ఎత్తైన రూపం అతడికి  కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. అప్పటినుంచి  కరో మన్‌ఘట్‌ అన్న పేరే కర్మన్‌ఘాట్‌గా మారింది.
  • కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి వారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి .రోజూ వందలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలను ఉంటాయి . 
  • ప్రశాంతమైన వాతావరణంలో వుండే ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన మోటార్‌ వాహనాలకు ఇక్కడ పూజచేయించడం సంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు శకట పూజ జరుగుతుంది.
  • హైదరాబాద్‌ నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ  ఆలయం వుంది.  దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ల నుంచి చేరుకోవచ్చు. హైదరాబాద్ వెళ్తే, మహిమ గల కర్మన్ ఘాట్ ఆంజనేయుని దర్శనం చేసుకోండి .

0 comments:

Post a Comment